: ఇలాంటి వారందరికీ ఇకపై వంట గ్యాస్ పై సబ్సిడీ కట్!

ఓ వైపు అధిక ఆదాయం ఉన్నప్పటికీ... వంట గ్యాస్ పై సబ్సిడీని వదులుకోవడానికి ఇష్టపడని ధనవంతులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వబోతోంది. ఏడాదికి రూ. 10 లక్షలకు మించి ఆదాయం ఉన్నవారికి ఇకపై గ్యాస్ సబ్సిడీ ఉండకపోవచ్చు. ఇప్పటికే ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత నుంచి ఆదాయపు పన్ను శాఖ అందరిపైనా పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఎవరెవరు ఎంతెంత డిపాజిట్ చేశారు? వారి పాన్ నంబర్ల ఆధారంగా... ఎవరెవరి ఆదాయం ఎంతెంత? అనే విషయాలను పరిశీలిస్తోంది.

ఈ క్రమంలో, తమ వద్ద ఉన్న సమాచారం మొత్తాన్ని... పెట్రోలియం మంత్రిత్వశాఖకు అందిస్తోంది. అంతేకాదు, ఆదాయ వివరాలు, పన్ను చెల్లింపులు, వ్యక్తిగత వివరాలు, పాన్ కార్డు డీటెయిల్స్, పుట్టిన తేదీ, ఐటీ డేటాబేస్ లో ఉన్న అడ్రస్ లు, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్లు, మొబైల్ నంబర్లు తదితర వివరాలన్నింటినీ పెట్రోలియం శాఖకు ఇస్తోంది. దీనికి సంబంధించి ఇరు శాఖల మధ్య ఇప్పటికే ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం పన్ను చెల్లింపుల వివరాలన్నింటీనీ పెట్రోలియం శాఖతో పంచుకోనుంది. ఈ నేపథ్యంలో, ఏడాదికి రూ. 10 లక్షలకు మించి ఆదాయం ఉన్న వారందరికీ గ్యాస్ సబ్సిడీ కట్ కాబోతోంది. 

More Telugu News