gali: మోదీ ఉదయం ఒకలా... సాయంత్రం మరోలా మాట్లాడుతున్నారు: గాలి ముద్దుకృష్ణమ ఆగ్రహం

పెద్ద‌నోట్ల ర‌ద్దు అనంత‌రం న‌ల్ల‌కుబేరుల చేతుల్లోకి కోట్ల రూపాయ‌ల విలువ చేసే కొత్తనోట్లు య‌థేచ్ఛ‌గా వెళుతుండ‌డం ప‌ట్ల  టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రిజ‌ర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి కొత్త‌నోట్లు నేరుగా కోటీశ్వరుల వ‌ద్ద‌కు వెళుతున్నాయని మండిప‌డ్డారు. ఈ రోజు అమ‌రావ‌తిలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ..  పెద్ద‌నోట్ల ర‌ద్దు నేపథ్యంలో ప్రధాని న‌రేంద్ర మోదీ ఉదయం ఒకలా, సాయంత్రం మరోలా వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని అన్నారు. ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తీర్చ‌డానికి నోట్ల ముద్ర‌ణ కోసం ప్రైవేటు ప్రెస్‌లను స్వాధీనం చేసుకుని మ‌రీ ప‌నులు కొన‌సాగించాల‌ని అన్నారు.

వైసీపీ అధినేత జగన్మోహ‌న్ రెడ్డిపై గాలి ముద్దుకృష్ణ‌మ మ‌రోసారి విమ‌ర్శ‌లు చేశారు. వైసీపీ అధినేత‌ పరువు చంచల్‌గూడ జైలుకు పోయిందని, ఆయ‌న డబ్బేమో ఈడీకి పోయిందని ఎద్దేవా చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి  చంద్రబాబు నాయుడు అభివృద్ధికి  ఒక‌ సూచిక అని ఆయ‌న అభివ‌ర్ణించారు. గ‌తంలో మంత్రిగా ఉన్న కాపునేత‌ ముద్రగడ కాపులకు చేసిన మేలు ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ముద్ర‌గ‌డ ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్‌లో పడ్డారని అన్నారు. కాపు సామాజిక వ‌ర్గ సంక్షేమం గురించి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నార‌ని అన్నారు.

More Telugu News