: ‘ఫార్ములా వన్’ మోజు.. ప్రాణం మీదికి తెచ్చింది.. గంటకు 210 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన మైనర్లు.. కారు బోల్తా

ఫార్ములా వన్ రేసు మోజు హైదరాబాద్‌కు చెందిన మైనర్ల ప్రాణాల మీదికి తెచ్చింది. 70 కిలోమీటర్ల దూరాన్ని 20 నిమిషాల్లో చేరుకునే క్రమంలో వారి కారు బోల్తాపడింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ తల్హా, మహ్మద్ షాకిల్, ఇద్దరు అమ్మాయిలు కలిసి ఇంట్లో చెప్పకుండా శనివారం ఉదయం కారు తీసుకుని హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు బయలుదేరారు. వీరంతా మైనర్లేనని పోలీసులు తెలిపారు.

మితిమీరిన వేగంతో వెళ్తున్న వీరి కారుకు జానంపేట వద్ద అండర్ పాసింగ్ బ్రిడ్జిపై ఓ లారీ అడ్డం వచ్చింది. దానిని తప్పించే ప్రయత్నంలో అదుపుతప్పి బోల్తాపడింది. రోడ్డుపై పల్టీలు కొట్టింది. కారు నుజ్జునుజ్జు అయింది. వెంటనే స్పందించిన స్థానికులు కారులో చిక్కుకుపోయిన నలుగురినీ బయటకు తీశారు. స్వల్పగాయాలు కూడా లేకుండా వారు బయటపడడం విశేషం. మైనర్లను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్‌లో వారిని విచారించిన పోలీసులకు చుక్కలు చూపించారు. తప్పుడు సమాచారంతో తికమకపెట్టారు.  కాగా శనివారం ఉదయం 9:55 నిమిషాలకు షాద్‌నగర్‌లోని టోల్‌ప్లాజా దాటిన మైనర్లు ప్రయాణిస్తున్న కారు 10:15 గంటలకు జానంపేట వద్ద ప్రమాదానికి గురైంది. అంటే 70 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 20 నిమిషాల్లోనే దాటేశారన్నమాట!

More Telugu News