: చెన్నయ్ టెస్టు: టీమిండియా బౌల‌ర్ల‌కు విసుగుతెప్పిస్తున్న ఇంగ్లండ్‌ టెయిలెండర్స్‌

చెన్న‌య్‌లో కొన‌సాగుతున్న‌ భారత్‌-ఇంగ్లండ్ చివరి టెస్టు మ్యాచులో రెండో రోజు బ్యాటింగ్ కొన‌సాగిస్తోన్న ఇంగ్లండ్ టెయిలెండర్లు భార‌త బౌల‌ర్ల స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తున్నారు. భార‌త బౌల‌ర్ల ధాటికి ఇంగ్లండ్ మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్ స్టోక్స్‌(6), బ‌ట్ల‌ర్ (5) పూర్తిగా విఫ‌ల‌మై, ఏడు వికెట్లు కోల్పోయిన ద‌శ‌లో  క్రీజులోకి వ‌చ్చిన డాస‌న్, ర‌షీద్ క్రీజులో నిల‌దొక్కుకున్నారు.  ఏమాత్రం పట్టు కోల్పోకుండా ఆడుతూ స్కోరును 400 మార్కును దాటించేశారు. వీలుచిక్కినప్పుడల్లా పరుగులు తీశారు. ఈ ఇద్దరూ క‌లిసి 8వ వికెట్‌కు అజేయంగా 100కి పైగా పరుగులు జోడించారు. ఇరువురూ హాఫ్ సెంచ‌రీలు సాధించారు.

అనంత‌రం ర‌షీద్ 60 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద ఔట్ అయ్యాడు. కాగా, డాసన్ 51 ప‌రుగుల‌తో క్రీజులో బ్యాటింగ్ కొన‌సాగిస్తున్నాడు. క్రీజులోకి వ‌చ్చిన బ్రాడ్ కూడా ధాటిగా ఆడుతూ 14 బంతుల్లోనే 17 ప‌రుగులు సాధించి క్రీజులో ఉన్నాడు.  ప్ర‌స్తుతం ఇంగ్లండ్ స్కోరు  448/8 (149 ఓవ‌ర్లకి)గా ఉంది. భార‌త బౌల‌ర్ల‌లో ఉమేష్‌, ఇషాంత్ లు రెండేసి వికెట్లు తీయ‌గా, జ‌డేజా మూడు వికెట్లు తీశాడు. మ‌రో వికెట్ అశ్విన్‌కు ద‌క్కింది.

More Telugu News