: పింఛన్ల పంపిణీ విషయంలో నా అంచనాలు తప్పినట్టున్నాయి.. చంద్రబాబు ఆవేదన

పింఛన్ల పంపిణీ విషయంలో తన అంచనాలు తప్పాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. వారికి చెల్లించాల్సిన సొమ్మును బ్యాంకుల్లో వేస్తే వారికి క్షేమంగా అందుతాయని భావించానని, కానీ బ్యాంకర్ల తీరుతో వృద్ధులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అందుకే వచ్చే నెల నుంచి పింఛన్లను నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్టు సీఎం పేర్కొన్నారు. శుక్రవారం తిరుపతిలో పర్యటించిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉపాధిహామీ చెల్లింపుల విషయంలోనూ ఇటువంటి ఇబ్బందులే ఎదురవుతున్నట్టు పేర్కొన్నారు. ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నట్టు వివరించారు. 

పూర్తిగా నగదు రహితం చేయడం సాధ్యం కాదని, నగదు కూడా కొంత చలామణిలో ఉండాలని అన్నారు. ఈ నెలలో 25 శాతం నగదు రహిత లావాదేవీలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. నేడు రాష్ట్రానికి మరో రూ.2,500 కోట్ల నగదు రానుందని తెలిపారు. ఈ సొమ్మును అన్ని బ్యాంకులకు సమానంగా  పంపిణీ చేయాలని బ్యాంకర్లకు సూచించారు. నగదు డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు మొబైల్ ఏటీఎంలు పంపి ఇబ్బందులు తీర్చాలని బ్యాంకర్లకు చంద్రబాబు సూచించారు.

More Telugu News