: సాకర్ ప్లేయర్ పై లైంగిక దాడి.. ముగ్గురు యువతులను దోషులుగా ప్రకటించిన కోర్టు!

బ్రిటన్ కు చెందిన ఓ ఫుట్ బాల్ క్రీడాకారుడిని చిత్రహింసలకు గురి చేసి, లైంగిక దాడి చేసిన కేసులో ముగ్గురు యువతులను కోర్టు దోషులుగా ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే, 20 ఏళ్ల ఓ ఫుట్ బాల్ క్రీడాకారుడిని బ్రోగాన్ గిల్లార్డ్ (26), పైగే కున్నిఘామ్ (22), షానన్ జోన్స్ (20) అనే ముగ్గురు యువతులు తమ ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అతడితో బలవంతంగా మద్యం తాగించారు. మద్యం మత్తులో ఉన్న అతడి దుస్తులను తొలగించి, అతనిపై లైంగిక దాడికి దిగారు. చాకుతో అతని ఛాతీపై ఉల్లిపాయలు, కూరగాయలు తరిగారు. మ్యూజిక్ పెట్టుకుని, అతని చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేశారు. అతని జుట్టును కూడా కత్తిరించి బోడిగుండు చేసేశారు. అంతేకాదు, ఈ దారుణాన్ని వారు వీడియో కూడా తీశారు. గత ఏడాది ఈ దారుణం జరిగింది. వారు తీసిన ఆ వీడియోనే ఇప్పుడు వాళ్ల పాలిట శాపంగా మారింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టులో కూడా విచారణ జరిగింది. తాము లైంగిక దాడికి పాల్పడినట్టు సదరు యువతులు కూడా ఒప్పుకున్నారు. అయితే, తమపై లైంగిక నేరాల చట్టాన్ని ప్రయోగించవద్దని వేడుకున్నారు. వీరికి త్వరలోనే శిక్షను ఖరారు చేయనుంది ప్రెస్టన్ క్రౌన్ కోర్టు.

More Telugu News