: ఇప్ప‌టివ‌ర‌కు రూ.3,000 కోట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు

పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న త‌రువాత అక్ర‌మ లావాదేవీల‌పై ప‌టిష్ట నిఘా పెట్టిన అధికారులు దేశ వ్యాప్తంగా దాడులు జ‌రుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అధిక మొత్తంలో డ‌బ్బు బ‌య‌టప‌డుతోంది. దేశ వ్యాప్తంగా మొత్తం 586 ప్రాంతాల్లో జరిపిన త‌నిఖీల్లో సుమారు రూ.3000 కోట్లు ప‌ట్టుబ‌డిన‌ట్లు ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు తెలిపారు. ప‌ట్టుబ‌డిన న‌గదులో రూ.79 కోట్లు కొత్త 2000 నోట్లేన‌ని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో క‌న్నా త‌మిళనాడు అత్య‌ధికంగా ప‌ట్టుబ‌డిన‌ట్లు చెప్పారు.  చెన్నయ్‌లో జ‌రిపిన ఆక‌స్మీక త‌నిఖీల్లో రూ.100 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్న‌ట్లు పేర్కొన్నారు. ఇక‌ ఆ రాష్ట్రంలోని ఇతర అన్ని ప్రాంతాల్లో క‌లిపి మొత్తం రూ.140 కోట్లు స్వాధీనం చేసుకున్న‌ట్లు చెప్పారు. డ‌బ్బుతో పాటు రూ.52 కోట్లు విలువ‌చేసే బంగారం కూడా ప‌ట్టుబ‌డిన‌ట్లు పేర్కొన్నారు.

కాగా, ఢిల్లీలోని ఓ న్యాయవాది వ‌ద్ద నుంచి రెండు వారాల క్రితం రూ.19 కోట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు తాజాగా మ‌రో రూ.14 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.  పూణెలో స్వాధీనం చేసుకున్న న‌గ‌దు వివ‌రాల గురించి చెబుతూ ఐటీ దాడుల్లో అక్క‌డ‌ రూ.10.80 కోట్ల నగదు పట్టుబడిందని అధికారులు చెప్పారు. అందులో రూ.8.8 కోట్ల కొత్త కరెన్సీ నోట్లున్నాయని పేర్కొన్నారు.

More Telugu News