: మేం అవినీతిపై పోరాడుతుంటే ప్రతిపక్షాలు ఆందోళన చేయడం ఎంత వరకు సమంజసం?: ప్రధాని మోదీ

పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తూ విపక్షపార్టీలు చేస్తున్న రాద్ధాంతంపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి మండిపడ్డారు. అవినీతిని అంతం చేసేందుకు అధికార పక్షం పోరాడుతుంటే, విపక్షాలు మాత్రం దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుండటాన్ని తప్పుబట్టారు. బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో చేసిన మోదీ ప్రసంగం వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ మీడియాకు వెల్లడించారు. ఆ పార్టీ వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు బోఫోర్స్, స్పెక్ట్రమ్ కుంభకోణాలు జరిగినప్పుడు ప్రతిపక్ష ఎన్డీయే ఆందోళన చేసిందని, ఇప్పుడు.. అవినీతిపై తాము పోరాడుతుంటే ఆందోళన చేయడం ఎంత వరకు సమంజసమని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

 కాగా, ప్రతిదానికి ఆధారాలు చూపాలంటూ విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై మోదీ తనదైన శైలిలో స్పందించారు. ఈరోజు బంగ్లాదేశ్ కు విముక్తి లభించినరోజు అని, అప్పటి విపక్షాలు ఇందుకు సంబంధించిన ఆధారాలు చూపమని అడగలేదని, అదే కనుక, ఇప్పటి విపక్షాలు అయితే, దీనికి ఆధారాలు చూపమని అడుగుతాయని ఎద్దేవా చేశారు. తమకు పార్టీ కంటే దేశమే ముఖ్యమని, ప్రతిపక్షానికి మాత్రం దేశం కంటే పార్టీయే ముఖ్యమని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు కురిపించారు. దేశ ప్రజలంతా నగదు రహిత లావాదేవీలను చేపట్టాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ సూచించారు.

More Telugu News