: ఎవరూ లాగేసుకోవడం లేదు కదా...శశికళకు తొందరెందుకు?: సినీ నటుడు ఆనంద్ రాజ్

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి కోసం దివంగత జయలలిత నెచ్చెలి శశికళ తొందరపాటు ప్రదర్శిస్తున్నారని ప్రముఖ సినీ నటుడు, పెదరాయుడు, బాషా వంటి విజయవంతమైన సినిమాల్లో ప్రతినాయక పాత్రలలో రాణించిన ఆనంద్ రాజ్ వ్యాఖ్యానించారు. చెన్నైలో ఓ తమిళ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సామాన్యులందరి మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న ఇదేనని అన్నారు. జయలలిత మృతిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, తమిళనాట ప్రజల్లో ఉన్న అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత అపోలో ఆసుపత్రిపై ఉందని ఆయన స్పష్టం చేశారు. జయలలితను చూసేందుకు వచ్చిన ఆమె మేనకోడలు దీపను అనుమతించలేదన్న విషయం తనకు తెలియదని ఆయన చెప్పారు.

అమ్మ మరణ వార్త ప్రకటనకు ముందే పార్టీ శాసనసభ్యుల సమావేశం నిర్వహించడమనేది పూర్తిగా పార్టీ అంతర్గత విషయమని ఆయన తెలిపారు. అదే సమయంలో ప్రభుత్వం ప్రకటించిన సంతాప దినాలు ముగియక ముందే శశికళ నాయకత్వం వహించాలంటూ డిమాండ్లు తెరపైకి రావడం బాధాకరమని ఆయన స్పష్టం చేశారు. అదీ కాకుండా తొందరపాటుతో పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని ఆయన హెచ్చరించారు. అంతా వారి అధీనంలోనే ఉన్నప్పుడు, వేరెవరూ లాగేసుకునే అవకాశం లేనప్పుడు తొందర ఎందుకని ఆయన ప్రశ్నించారు. నిదానంగా కార్యాచరణలోకి దిగాలని ఆయన సూచించారు. శశికళ నాయకత్వాన్ని కోరుకోవడం అనేది వారివారి వ్యక్తిగత విషయమని ఆయన తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎవరు ఉన్నా కార్యకర్తగా తాను సేవలందిస్తానని ఆయన స్పష్టం చేశారు. 

More Telugu News