: పాన్ నిబంధనల్లో మార్పు.. రూ.50,000 నుంచి రూ.2.5 లక్షల మధ్య జమపై సైతం ఐటీ అధికారుల నిఘా

న‌ల్ల‌ధ‌నాన్ని అరిక‌ట్ట‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం పెద్ద‌నోట్లను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్న త‌రువాత అక్ర‌మ లావాదేవీల‌ను జ‌రుపుతున్న వారి ఆట‌లు క‌ట్టించ‌డానికి ప‌లు చ‌ట్టాల్లో స‌వ‌ర‌ణ‌లు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా ఆదాయపన్ను చట్టంలో మ‌రో స‌వ‌ర‌ణ‌ను చేశారు. ఐటీ చ‌ట్టంలోని శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)కు సంబంధించిన 14(బి) నిబంధన స‌వ‌ర‌ణ జ‌రిగింది. ఈ స‌వ‌ర‌ణ ప్ర‌కారం రూ.50,000 నుంచి రూ.2.5 లక్షల వరకు డిపాజిట్‌ చేసి, పాన్ నెంబరు ఇవ్వని ఖాతాల పైన కూడా ఆదాయప‌న్ను శాఖ అధికారులు నిఘా పెట్ట‌నున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కు బ్యాంకుల్లో డ‌బ్బు రూ.50,000 కన్నా ఎక్కువ జ‌మ‌చేస్తే ఖాతాదారుడు పాన్ నెంబ‌రు ఇవ్వాల‌ని నిబంధ‌న ఉండేది. అయితే, పాన్ నెంబ‌రు ఇవ్వడంపై ఇష్టం చూప‌ని వారు రూ.50,000 క‌న్నా తక్కువ న‌గ‌దును పలుసార్లు డిపాజిట్ చేసుకునేవారు. తాజాగా తీసుకొచ్చిన నిబంధ‌న‌తో పాన్‌ సంఖ్య ఇవ్వకుండా ఒకే బ్యాంకు ఖాతాలో రూ.50,000 కన్నా తక్కువ మొత్తం న‌గ‌దును ప‌లుసార్లు డిపాజిట్ చేస్తే వాటిపై నిఘా ఉంచ‌నున్నారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు చేసిన రోజు నుంచి పాన్ నెంబ‌రు ఇవ్వ‌కుండా ఈ నెల 30 వ‌ర‌కు 50,000 రూపాయ‌ల క‌న్నా త‌క్కువ న‌గ‌దును ప‌లుసార్లు జ‌మ‌చేసుకొని, మొత్తం రూ.2.5 లక్షలు, అంతకన్నా ఎక్కువ డిపాజిట్ చేసుకున్న వారి వివ‌రాల‌ను బ్యాంకు అధికారులు ఆదాయ శాఖ అధికారుల‌కు ఇవ్వాల్సి ఉంటుంది.

More Telugu News