pak cricketers war: 'నువ్వెంతంటే.. నువ్వెంత' అంటూ తోసుకున్న పాక్ క్రికెటర్లు

పాకిస్థాన్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ నేటి నుంచి ప్రారంభమైంది. ఇందులో భాగంగా నేడు బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో తొలి టెస్టు ప్రారంభమైంది. మ్యాచ్ కు ముందు పాక్ జట్టు ప్రాక్టీస్ సందర్భంగా ఆ జట్టు ఆటగాళ్ల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. ప్రాక్టీస్ సందర్భంగా పాక్ ఆటగాళ్లు ఫుట్ బాల్ ఆడారు. ఈ సందర్భంగా ఆ జట్టు బౌలర్లు వాహబ్ రియాజ్, యాసిర్ షా మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది పెరిగి తోపులాట వరకు వెళ్లింది. 'నువ్వెంతంటే.. నువ్వెంత' అని సవాల్ విసురుకున్న వీరిద్దరూ ఒకర్నొకరు తోసుకున్నారు. దీంతో రంగప్రవేశం చేసిన కోచ్ ఇద్దరికీ సర్ది చెప్పి ప్రాక్టీస్ ముగించారు. అనంతరం వీరిద్దరూ డ్రస్సింగ్ రూంలో షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకున్నారు. అనంతరం మాట్లాడుతూ, తామిద్దరం మంచి స్నేహితులమని, ఇలాంటి చిన్నచిన్న విషయాలు మామూలేనని తెలిపారు. తమ ఇద్దరి మధ్య ఏమీ జరగలేదని, తమ గురించి ప్రార్థన చేయాలని అభిమానులకు సూచించారు. 

More Telugu News