: వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ‘పతంజలి’ సంస్థకు జరిమానా

తప్పుడు ప్రకటనల ద్వారా వినియోగదారులను పక్కదోవ పట్టించిందనే అభియోగాల నేపథ్యంలో యోగా గురు రాందేవ్ బాబాకు చెందిన  పతంజలి ఆయుర్వేద  సంస్థకు జరిమానా విధించారు. కాగా, 2012 ఆగస్టులో నిర్వహించిన ఆహార భద్రతా ప్రమాణాల పరీక్షల్లో పతంజలి సంస్థ వస్తువులు విఫలమయ్యాయి. దీంతో, అదే ఏడాది నవంబర్ లో ఈ వ్యవహారంపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇందుకు సంబంధించి ఈ నెల 1వ తేదీన వెలువడిన తీర్పు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 ఆ తీర్పు  వివరాలు.. అభియోగాలు నిరూపణ కావడంతో రూ.11 లక్షల జరిమానా చెల్లించాలని హరిద్వార్ లోని జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు పతంజలిని ఆదేశించింది. ఇతర సంస్థలు తయారు చేసిన వస్తువులను తమ బ్రాండ్ పేరిట ప్రకటనల్లో పేర్కొని వినియోగదారులను పక్కదోవ పట్టిస్తోందని, ఆదాయం పెంచుకోవాలని చూస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. సెక్షన్లు 52,53 కింద తప్పుడు ప్రకటనలు, వినియోగదారులను పక్కదోవ పట్టించడం వంటి నేరాలతో పాటు ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని నేరం కింద జరిమానా విధించారు. నెలరోజుల్లోగా ఆ మొత్తాన్ని చెల్లించాలని, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆహార నాణ్యత ప్రమాణాల శాఖను కోర్టు ఆదేశించింది. 

More Telugu News