: నేడు ఏపీకి రానున్న రూ.500 కోట్ల విలువైన కరెన్సీ.. అందులో రూ.300 కోట్లు రూ.500 నోట్లే!

ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడుతున్న చిల్లర ఇబ్బందులు నేటితో కొంతమేరకు తీరనున్నాయి. నేటి ఉదయం రిజర్వు బ్యాంకు నుంచి రూ.500 కోట్ల విలువైన కొత్త కరెన్సీ రాష్ట్రానికి రానుంది. ఇందులో రూ.300 కోట్ల విలువైన కొత్త రూ.500 నోట్లు ఉన్నాయని తెలిసి ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక చిల్లర సమస్యలు గట్టెక్కినట్టేనని భావిస్తున్నారు. అయితే ఈ సొమ్మును పింఛన్ల
పంపిణీకే ఉపయోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం రూ.1058  కోట్ల నగదు అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. ఈ  సొమ్ములో రూ.340 కోట్లు చిన్న నోట్లు ఉన్నాయన్నారు. మరో మూడు రోజుల్లో మరింత నగదు రాష్ట్రానికి అందనున్నట్టు సీఎం తెలిపారు. ఏటీఎంల వద్ద క్యూలైన్లలో నిల్చున్న వారిలో కొందరు మృత్యువాత పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయని, ఇక నుంచి అటువంటి ఘటనలు జరగకూడదని అన్నారు. బ్యాంకులు, ఏటీఎంల వల్ల రద్దీ పెరిగిందంటే పనితీరులో లోపం ఉన్నట్టేనన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా బ్యాంకుల వద్ద టెంట్లు, కుర్చీలు వేయాలని అధికారులను ఆదేశించారు.

More Telugu News