: రక్షణశాఖ వ్యయంలో నాలుగో స్థానంలో నిలిచిన భారత్!

ప్రపంచ దేశాల మ‌ధ్య ఏర్పడుతున్న ప్ర‌తికూల ప‌రిస్థితులు, ఉగ్ర‌దాడుల నేప‌థ్యంలో అన్ని దేశాలు త‌మ ర‌క్ష‌ణ‌శాఖ మీద పెడుతున్న వ్య‌యాన్ని మ‌రింత పెంచుకుంటున్నాయి. గతేడాదితో పోల్చి చూస్తే ఈ వ్య‌యం పెరిగింది. ఐహెచ్‌ఎస్‌ ఇన్‌కార్పొరేషన్‌ ఆధ్వర్యంలోని జేన్స్‌ డిఫెన్స్‌ వీక్లీ ప్రచురించిన వివరాల ప్ర‌కారం భార‌త్ సౌదీ అరేబియా, ర‌ష్యాల కంటే ఎక్కువ‌గా ఖ‌ర్చు పెడుతూ రక్షణశాఖ కోసం ఎక్కువ వ్యయం చేస్తున్న దేశాల్లో నాలుగో స్థానంలో నిలిచింది.

అన్ని దేశాలు భ‌విష్య‌త్తులో ర‌క్ష‌ణ వ్య‌యాన్ని మ‌రింత పెంచుకుంటూ వెళ‌తాయ‌ని జేన్స్‌ డిఫెన్స్‌ వీక్లీ పేర్కొంది. గతేడాది 1.55 ట్రిలియన్‌ డాలర్లుగా న‌మోదైన ప్రపంచ రక్షణ వ్యయం ఈ ఏడాది మ‌రింత పెరిగి 1.57 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుందని చెప్పింది. ఇందుకు ప్ర‌ధానంగా సౌత్‌ చైనా పరిస్థితులే కారణమని తెలిపింది. ఈ ఏడాది అమెరికా ఈ విష‌యంలో 622 బిలియన్‌ డాలర్లు ఖర్చు పెట్టి మొద‌టి స్థానంలో నిలిచింద‌ని,  1.55 ట్రిలియన్‌ డాలర్లలో 40 శాతం ఖ‌ర్చు ఆ దేశ‌మే చేస్తోంద‌ని తెలిపింది. అమెరికా త‌రువాత వరసగా చైనా, యూకే, ఇండియా దేశాలు ర‌క్ష‌ణ వ్య‌యాన్ని అధికంగా చేస్తున్నాయ‌ని పేర్కొంది.  ఈ ఏడాది బ్రిట‌న్‌ రక్షణశాఖ బడ్జెట్‌గా 219 బిలియన్‌ డాలర్లను కేటాయించింది.

చైనా వినియోగిస్తోన్న వ్య‌యంపై వివ‌రిస్తూ, 2010లో చైనా వ్య‌యం 123 బిలియన్‌ డాలర్లుగా ఉండేద‌ని, 2020 నాటికి అది రెండింత‌లు అయ్యే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ఈ వ్య‌యం యూకే కన్నా నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది. అదే స‌మ‌యంలో యూకే పౌండు విలువ ఇలాగే క్షీణిస్తూ వెళితే 2018 నాటికి బ్రిటన్‌ కన్నా భారత్ ఈ అంశంలో చేస్తోన్న‌ వ్యయం ఎక్కువగా ఉంటుంద‌ని చెప్పింది.

More Telugu News