: విజయవాడలో వేగంగా వస్తోన్న రైలుతో సెల్ఫీకి ప్రయత్నించిన విద్యార్థి.. ప్రమాదంలో కాలు విరగ్గొట్టుకున్న వైనం
సెల్ఫీల మోజుతో యువకులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నా యువత మాత్రం తమ తీరుమార్చుకోవడం లేదు. ప్రమాదమని తెలిసినప్పటికీ తమ రూటు మార్చుకోకుండా ప్రమాదకర ప్రదేశాల వద్ద సెల్ఫీలు దిగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రి పాలవుతున్నారు. విజయవాడలో ఇటువంటి ఘటనే తాజాగా మరొకటి చోటు చేసుకుంది. మధురానగర్ పప్పుల మిల్లు రైల్వేగేటు వద్ద పదో తరగతి విద్యార్థి వరదరాజులు(15) వేగంగా దూసుకొస్తున్న రైలు పక్కన నిలబడి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో రైలు ఢీ కొనడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. తృటిలో ప్రాణాపాయం తప్పింది.
ట్రాక్ పక్కన నిలబడి వెనుకనుంచి రైలు వస్తుండగా మొబైల్ తో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడని, సెల్ఫీ స్పష్టంగా రావాలని ఆరాటపడుతూ కొంచెం పక్కకు జరిగాడని, దాంతో రైలుకు సమీపంలోనికి వెళ్లిపోవడంతో రైలు ఇంజిన్ వెడల్పుగా ఉండడంతో అతని చేతికి తగిలిందని స్థానికులు చెప్పారు. దీంతో ఆ విద్యార్థి ఎగిరి దూరంగా పడ్డాడడని తెలిపారు. ఈ ప్రమాదంలో వరదరాజులుకు కాలు విరిగింది. అంతేగాక ముఖం, ఒంటిపై తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం దగ్గరలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.