: జయలలిత చికిత్స ఖర్చుపై అపోలో వైద్యుల డొంకతిరుగుడు సమాధానాలు

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఆమెకు అందించిన చికిత్స వివరాలను వెల్లడించలేదని... అసలు ఆమె ఎప్పుడు చనిపోయారో అనే విషయంలో కూడా క్లారిటీ లేదని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. దీనికి తోడు జయ చికిత్సకు అయిన ఖర్చు వివరాలు కూడా ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.

హై ఫీవర్, డీహైడ్రేషన్ తో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలితకు 75 రోజుల పాటు వైద్యులు చికిత్స అందించారు. ఈ చికిత్సకుగాను అపోలో యాజమాన్యం రూ. 90 కోట్ల బిల్లును వేసిందని... ఆరోగ్య పథకాలకు సంబంధించిన నిధుల నుంచి ఈ మొత్తాన్ని కేటాయించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. అయితే, ఈ వార్తలను అపోలో వైద్యులు ఖండిస్తున్నారు. జయ చికిత్సకు రూ. 90 కోట్లు ఖర్చుకాలేదని... అయితే, కొన్ని కోట్ల రూపాయలు మాత్రం ఖర్చయ్యాయని తెలిపారు. ఎంత ఖర్చయిందో స్పష్టంగా చెప్పకుండా, కొన్ని కోట్లు అంటూ డొంకతిరుగుడు సమాధానాలు ఇస్తూ, జనాలను మరింత కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మరోవైపు, చికిత్స బిల్లులను చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని ఆసుపత్రి యాజమాన్యం ఇంకా కోరలేదని వైద్యులు తెలిపారు.

More Telugu News