: కఫాలా రద్దు చేస్తూ ఖతర్ సంచలన నిర్ణయం.. లక్షలాది కార్మికులకు లబ్ధి.. నేటి నుంచే అమల్లోకి!

ఆధునిక బానిసత్వంగా భావించే ‘కఫాలా’ను రద్దు చేస్తూ గల్ఫ్ దేశం ఖతర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం నేటి నుంచే(డిసెంబరు 13) అమల్లోకి రానున్నట్టు ప్రకటించింది. ఇకపై తమ దేశంలో పనిచేస్తున్న, పనిచేయాలనుకుంటున్న విదేశీ కార్మికులను ‘కాంట్రాక్టు కార్మికులు’గా పరిగణిస్తామని ఖతర్ కార్మికశాఖా మంత్రి ఇసాబిన్ సాద్ అల్ జఫాలి తెలిపారు. ఖతర్ సంచలన నిర్ణయంతో ఆ దేశంలో పనిచేస్తున్న భారతీయులతోపాటు మొత్తం 21 లక్షల మంది విదేశీ కార్మికులకు లబ్ధి చేకూరనుంది.

 ప్రస్తుతం కఫాలా వ్యవస్థ ఖతర్, సౌదీ అరేబియా, ఒమన్, కువైట్, బహ్రెయిన్ దేశాల్లో అమల్లో ఉంది. దీని ప్రకారం ఎవరైనా ఆయా దేశాల్లో ఉద్యోగం పొందాలంటే స్పాన్సర్‌షిప్ లెటర్ తప్పని సరి. దీనినే కఫాలా అంటారు. అభ్యర్థిని నియమించుకుంటూ ఇచ్చే ధ్రువీకరణ పత్రం. ఇది ఉంటేనే వీసా మంజూరు చేస్తారు. ఉద్యోగంలో చేరిన తర్వాత కార్మికుల వీసాలు యజమానుల చేతిలోకి వెళ్లిపోతాయి. ఫలితంగా యజమానుల అనుమతి లేకుండా కార్మికులు పనిమారే వీలుండదు. ఒకవేళ మారాలని ప్రయత్నిస్తే జైలుశిక్ష, జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో అక్కడి కార్మికులు దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు దీనిని రద్దు చేయడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News