: ‘వార్దా’ బీభత్సంపై చెన్నయ్ నటుల ట్వీట్లు

చెన్నయ్ లో ‘వార్దా’ తుపాన్ బీభత్సంపై పలువురు నటులు ట్వీట్లు చేశారు. మరికొంతమంది, అక్కడి దృశ్యాలను వీడియో తీసి పోస్ట్ చేశారు. ప్రముఖ నటుడు సత్యరాజ్ తనయుడు, హీరో శిబిరాజ్ షూటింగ్ నిమిత్తం వెళ్తుంటే తన కారుపై చెట్టుపడిందని, వెంటనే కారును పక్కన పెట్టేసి సమీపంలోని హోటల్ కు వెళ్లామని తన ట్వీట్ లో పేర్కొన్నాడు. ‘వార్దా’ నేపథ్యంలో అందరూ సురక్షితంగా ఉండండి అంటూ ఆ ట్వీట్ లో కోరాడు. చెన్నయ్ లోని తన ఇంటికి కాలి నడకన వెళ్లే మార్గం మూసుకుపోయిందని నటుడు సందీప్ కిషన్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు. తన నివాసం ముందు చెట్లు విరిగి పడి ఉన్న ఫొటోలను సందీప కిషన్ పోస్ట్ చేశాడు. తన ఇంటికి వెళ్లే మార్గంలో కిందపడిపోయిన చెట్ల వద్ద నిలబడి కొందరు సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేస్తుండటాన్ని తాను చూశానని, బాధ్యత గల వ్యక్తుల్లా ప్రవర్తించాలని, సురక్షితంగా ఉండాలని కోరుతూ దర్శకురాలు అర్చనా కల్ఫథి తన ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా, తుపాన్ బీభత్సానికి సంబంధించిన ఒక వీడియోను కూడా ఆమె పోస్ట్ చేశారు. వర్షం పడుతుండగా తీసిన ఒక వీడియోను నటి మంజిమా మోహన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 

More Telugu News