: వలస విధానంలో సవరణలపై చర్చకు టాప్ టెక్ కంపెనీల సీఈవోలంద‌రినీ పిలిచిన ట్రంప్!

త్వ‌ర‌లోనే అమెరికా అధ్య‌క్షుడిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్న డొనాల్డ్ ట్రంప్ అధ్య‌క్ష పీఠంపై కూర్చున్న త‌రువాత‌ ఆ దేశ వ్య‌వ‌హారాల‌ను మ‌రింత‌ చ‌క్క‌బెట్టే ప్ర‌య‌త్నంలో ఇప్ప‌టి నుంచే ప‌లువురు ప్ర‌ముఖుల‌తో భేటీ అవుతున్నారు. టెక్ కంపెనీలు ఆల్ఫాబెట్ ఇంక్, ఫేస్బుక్, అమెజాన్, మైక్రోసాప్ట్, యాపిల్  వంటి కంపెనీల సీఈవోలంద‌రికీ తాజాగా ఆయ‌న నుంచి ఓ ఆహ్వానం అందింది. అందులో ఎల్లుండి న్యూయార్క్ సిటీ, ట్రంప్ టవర్స్లో సదస్సు జరుగుతుంద‌ని, వారందరూ ఆ స‌ద‌స్సుకు హాజ‌రుకావాల‌ని ఉంది. టెక్ లీడర్లతో ట్రంప్ ఈ స‌ద‌స్సు నిర్వహిస్తున్నారని రీకోడ్ రిపోర్టులో పేర్కొంది. సుమారు 12 మంది టెక్ కంపెనీల‌ సీఈవోలు ఈ స‌ద‌స్సులో పాల్గొన‌నున్న‌ట్లు తెలుస్తోంది. ట్రంప్ పంపిన ఆహ్వానంపై స్పందించిన బిలీనియర్, టెస్లా మోటార్స్ ఇంక్ సీఈవో ఎలోన్ మస్క్  తాను ట్రంప్ నిర్వ‌హించ‌నున్న స‌ద‌రు స‌ద‌స్సులో పాల్గొంటున్న‌ట్లు తెలిపారు.

ఒరాకిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సఫ్రా కాట్జ్ కూడా స్పందిస్తూ..  డొనాల్డ్ ట్రంప్తోనే తాముంటామని, ఆయ‌న‌కు త‌మ నుంచి ఎటువంటి సాయం కావాలన్నా అందిస్తామ‌ని చెప్పారు. ట్యాక్స్ కోడ్‌పై ఆయ‌న మాట్లాడుతూ...  ఒకవేళ ట్రంప్ అందులోని నిబంధనలు సడలించి, మంచి వాణిజ్య ఒప్పందాలను ఏర్పరిస్తే బాగుంటుంద‌ని, త‌మ దేశ‌ టెక్నాలజీ కమ్యూనిటీ మరింత బల‌ప‌డుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. భ‌విష్య‌త్తులో మ‌రింత అధికంగా పోటీ వాతావరణం పెరుగుతుందని అన్నారు. మ‌రికొంత మంది టెక్ కంపెనీల సీఈవోలు కూడా ఆ స‌ద‌స్సుకు హాజ‌రుకానున్న‌ట్లు తెల‌పారు.

 కాగా ఫేస్బుక్, ఆపిల్, అమెజాన్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్‌ కంపెనీల సీఈవోలు ఈ స‌ద‌స్సుకు హాజ‌రు అయ్యేదీ లేనిదీ ఇంకా చెప్పలేదు. ట్రంప్ నిర్వ‌హించ‌నున్న ఈ స‌ద‌స్సులో 'వలస విధానంలో సవరణలు' అంశంతో పాటు 'సామాజిక ఆందోళనలు' వంటి అనేక అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు. మరోపక్క, కొన్ని కంపెనీల సీఈవోలు ఈ స‌ద‌స్సులో పాల్గొన‌బోమ‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

More Telugu News