: మహిళ ప్రాణాలు బలిగొన్న ఆప్ ర్యాలీ!

దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన ఓ ర్యాలీ ఒక మహిళ ప్రాణాలను బలిగొంది. ఈ ర్యాలీ వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో, ఈ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్న అంబులెన్స్ లో ఓ మహిళ ప్రాణాలు వదిలింది. వివరాల్లోకి వెళ్తే, అవతార్ కౌర్ అనే మహిళ తక్కువ బ్లడ్ షుగర్, నీళ్ల విరేచనాలతో బాధపడుతోంది. ఆమెను గిల్ రోడ్డులోని గ్రేవాల్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో... మోడల్ టౌన్ లోని కృష్ణా ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి డాక్టర్లు సూచించారు. దీంతో ఆమెను తీసుకుని హుటాహుటిన అంబులెన్స్ లో బయలుదేరారు కుటుంబసభ్యులు. కానీ, ఆప్ ర్యాలీ వల్ల ట్రాఫిక్ జామ్ అయింది. అంబులెన్స్ ముందుకు కదిలేలా సహకరించాలని ఆమె కుమారుడు పలుమార్లు ప్రాధేయపడ్డాడు. కన్నీరు పెట్టుకున్నాడు. అయినా ఎవరూ సహకరించలేదు. ఈ క్రమంలో ఆమె తుదిశ్వాస విడిచింది. ఆప్ పార్టీ వల్లే తన తల్లి మరణించిందని ఆమె కుమారుడు దేవేందర్ సింగ్ ఆరోపించాడు.

More Telugu News