: పాత నేరస్థుడి అరెస్టు.. 60 తులాల బంగారం, ద్విచక్రవాహనం స్వాధీనం

హైదరాబాద్ లో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్థుడు మహ్మద్ అమీర్ ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన మరో ఇద్దరిని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఇతను 23 గొలుసు దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ దొంగతనాలు జరుగుతున్న తీరును పరిశీలించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు పాతనేరస్థుడు అమీరే ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో 23 గొలుసు దొంగతనాలకు తానే పాల్పడినట్లు అమీర్ అంగీకరించినట్లు డీసీపీ లింబారెడ్డి చెప్పారు. నిందితుడు అమీర్ నుంచి 60 తులాల బంగారు ఆభరణాలు, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కాగా, గతంలో 34 గొలుసు దొంగతనాలకు పాల్పడి పీడీ చట్టం కింద అరెస్టయి, ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించిన మహ్మద్ అమీర్ ఈ ఏడాది మార్చిలో విడుదలయ్యాడు. జైలు నుంచి విడుదల అయిన తర్వాత కూడా మళ్లీ అవే పనులకు పాల్పడుతున్నాడు.

More Telugu News