: 10 రూపాయల నోట్లతో కారుకొని పట్టుబడ్డ కుర్రకారు

ఉత్తరప్రదేశ్ లో నివ్వెరపోయే ఘటన ఒకటి వెలుగు చూసింది. షెహరాన్ పూర్ జిల్లా బెహత్ తహశీల్ పరిధిలో నోట్లు లభించక రైతులు, మిగిలిన అన్ని వర్గాలు నానా అగచాట్లు పడుతుంటే.... మలక్ పూర్ హుస్సేన్ గ్రామానికి చెందిన నలుగురు యువకుల వ్యవహారం భిన్నంగా ఉంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత చేతి నిండా చిన్న నోట్లతో, కొత్త కారుతో వీరు చేసే పనులు చూసి స్థానికులకు సైతం సందేహాలు కలిగాయి. దీంతో వారిపై అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. నసీర్, రాకేశ్, అఫ్జల్, టిటులు డబ్బులను మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారని తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు నసీర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా కళ్లు తిరిగే నిజాలు బయటపడ్డాయి. ఈ నలుగురూ నవంబర్ 19న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూరల్ బ్రాంచ్ లో రూ.10 లక్షలకు సమానమైన రూ.10, రూ.20 నోట్లను దోపిడీ చేసినట్టు వెల్లడైంది. అంతేకాదు, రూ.10 నోట్లతో ఏకంగా ఓ సెకండ్ హ్యాండ్ కారును కూడా కొనేశారు. అయితే, పోలీసులు నసీర్ నుంచి కేవలం రూ.50 వేలను మాత్రమే రికవరీ చేయగలిగారు. కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురూ పట్టుబడితే మరి కొంత నగదు స్వాధీనం చేసుకోవచ్చని భావిస్తున్నారు.

More Telugu News