: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి

ఉభయ తెలుగు రాష్ట్రాలు చలికి గజగజలాడుతున్నాయి. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం అయితే దట్టమైన పొగమంచు గుప్పిట చిక్కుకుంది. శనివారం రాత్రి లంబసింగిలో అత్యల్పంగా 11 డిగ్రీలు నమోదైంది. అలాగే, చింతపల్లి, అరకు తదితర ప్రాంతాల్లోనూ పడిపోయిన ఉష్ణోగ్రతలతో చలి విపరీతంగా పెరిగిపోయింది. మరోవైపు వార్ధా తుపాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, మెదక్, హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలికి ప్రజలు వణికిపోతున్నారు. ఆదిలాబాద్ లో ఉష్ణోగ్రతలు దారుణంగా 6 డిగ్రీలకు పడిపోయాయి. సాధారణం కంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీల వరకు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వార్ధా తుపాను తీరం దాటిన తర్వాత 12, 13వ తేదీల్లో తెలంగాణాలోని పలు ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశాలున్నాయని ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే.

More Telugu News