: క్రికెట్ ఆడడానికి వెళ్లి అనుకోకుండా ఓ హంతకుడ్ని పట్టుకున్న యువకులు!
అలవాటు ప్రకారం క్రికెట్ ఆడేందుకు వెళ్లిన యువకులు ఓ హంతకుడ్ని పోలీసులకు పట్టించిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... రవి అనే వ్యక్తి గత ఆరేళ్లుగా ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడు. ఆమెతో కలిసి రవి ఆరావళీ పర్వత ప్రాంతానికి వెళ్లాడు. అక్కడికి దగ్గర్లోని గ్రామానికి చెందిన యువకులు క్రికెట్ ఆడేందుకు వస్తుంటారు. అయితే సాధారణంగా ఎవరూ వెళ్లని ప్రదేశానికి రవి, ఆ యువతి వెళ్లడం చూసిన యువకులు అనుమానంతో వారిని అనుసరించారు. ఎవరూ లేని ప్రాంతానికి ఆమెను తీసుకువెళ్లిన రవి, అక్కడ ఆ యువతి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఊపిరి ఆడుతోందో లేదో గమనించి, ఆమె తలపై బండరాయితో మోది గుర్తుపట్టని విధంగా చేశాడు. దీనిని చూసిన యువకులు అతనిని సమీపించారు. వారి అలికిడితో అప్రమత్తమైన రవి, ఆమెపై దుప్పటి కప్పి కవర్ చేసే ప్రయత్నం చేశాడు. దీంతో అతన్ని పట్టుకున్న యువకులు అతని జేబులు తనిఖీ చేయగా, కొంత నగదు, ఏటీఎం కార్డులు, రివాల్వర్ గుర్తించారు. దీంతో అతనిని పోలీసులకు అప్పగించారు. దీంతో ఇది వరకే పెళ్లయిన తాను ఈ యువతితో ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నానని, ఆమె వద్దనున్న నగదు, విలువైన వస్తువుల కోసమే హత్య చేశానని విచారణలో వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు.