: కారు నడుపుతూ ఫేస్‌బుక్‌ లైవ్‌ స్ట్రీమింగ్ ఆన్ చేసిన ఇద్దరు యువతులు.. మృతి

కొన్ని రోజుల క్రితం అమెరికాలో ఓ యువకుడు అతివేగంగా ప్రయాణిస్తూ ఫేస్‌బుక్‌ ప్రవేశపెట్టిన వీడియో స్ట్రీమింగ్‌ సదుపాయంతో ఆ దృశ్యాలను లైవ్‌లో స్ట్రీమింగ్ ఇచ్చి ప్రమాదానికి గురై తీవ్రగాయాల పాలయిన ఘటన మరవకముందే, ఇటువంటి ఘ‌ట‌నే మ‌రొక‌టి అదే దేశంలో తాజాగా చోటుచేసుకుంది. పెన్సిల్వేనియాలో ఫేస్‌బుక్ వీడియో స్ట్రీమింగ్ ను ఉప‌యోగించిన ఇద్ద‌రు యువ‌తులు ప్ర‌మాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. వివ‌రాలు చూస్తే.. మెక్‌ డొనాల్డ్స్‌లో పనిచేస్తున్న హూగ్స్‌ తన మిత్రురాలు మోరిసన్‌ టూమేతో కలిసి కారులో వెళుతోన్న స‌మ‌యంలో వారిద్ద‌రి మ‌ధ్య ఫేస్‌బుక్‌ లైవ్‌ గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. దీంతో తన మిత్రురాలికి దాని గురించి వివ‌రించేందుకు హ్యూగ్స్‌ వెంటనే త‌న మొబైల్ తీసి ఫేస్‌బుక్ లైవ్‌ను ప్రారంభించింది. కారులో వెళుతూనే ఆ దృశ్యాల‌ను చిత్రీకరించింది. కాసేప‌టికే వారు ప్రయాణిస్తున్న కారును ఓ ట్ర‌క్కు ఢీకొట్టింది. దీంతో వారిరువురూ మృతి చెంద‌గా ట్రక్కు డ్రైవర్‌కి ఎటువంటి గాయాలు కాలేదు. లైవ్ వీడియోలో చిత్రీక‌రించిన దృశ్యాలు వీడియో హ్యూగ్స్‌ ఫేస్‌బుక్‌ పేజీలో చ‌క్క‌ర్లు కొట్టాయి. ఈ వీడియోను ఇప్పటి వరకు 7వేల మంది చూశారు. అయితే, ఈ యాక్సిడెంట్ దృశ్యాలు ఘోరంగా ఉండ‌డంతో 18 ఏళ్లలోపు వారు చూడకుండా ఆటోప్లేను ఫేస్‌బుక్‌ నిషేధించింది.

More Telugu News