: జయలలితపై శశికళ విష ప్రయోగం.. అన్నాడీఎంకే న్యాయవాది సంచలన ఆరోపణ

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ఆమె నెచ్చెలి శశికళ విష ప్రయోగం చేశారంటూ అన్నాడీఎంకే న్యాయవాది సంచలన ఆరోపణ చేశారు. విషం పెట్టడం వల్లే జయ మృతి చెందారంటూ న్యాయవాది ఆర్.కృష్ణమూర్తి పేర్కొన్నట్టు చెబుతున్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. జయ మొత్తం ఆస్తులను కాజేసేందుకు శశికళ ప్రయత్నాలు ప్రారంభించారంటూ ఆ ఆడియోలో కృష్ణమూర్తి ఆరోపించారు. జయ ఆస్తులు అన్యాకాంత్రం కాకుండా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నట్టు పేర్కొన్నారు. అంతేకాక శశికళ వీలైనంత త్వరగా, మర్యాదగా పోయెస్ గార్డెన్ నుంచి వెళ్లిపోవాలని అందులో హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఆడియో తీవ్ర దుమారం రేపడంతో శశికళ వర్గీయులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. శుక్రవారం కోయంబత్తూరుకు వచ్చిన కృష్ణమూర్తిని అన్నాడీఎంకేకు చెందిన కొందరు లాయర్లు చుట్టుముట్టి దాడిచేసినంత పనిచేశారు. అన్నాడీఎంకే గురించి మాట్లాడేందుకు నీవెవరంటూ ప్రశ్నించారు. నీ అంతు చూస్తామని బెదిరించారు. కాగా ఇదే ఆడియోలో తాను జయలలిత పేరుతో ఓ పార్టీని స్థాపించనున్నట్టు కృష్ణమూర్తి పేర్కొనడం విశేషం.

More Telugu News