: నోట్లరద్దు నిర్ణయంపై మరోసారి ఆందోళన వ్యక్తం చేసిన మన్మోహన్ సింగ్
పెద్దనోట్ల రద్దు అంశంపై ఇటీవలే పార్లమెంటులో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రసంగించి, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నోట్ల రద్దుపై రాసిన ఓ వ్యాసాన్ని 'ద హిందూ' ఆంగ్ల పత్రిక ఈ రోజు ప్రచురించింది. అందులో ఆయన నోట్లరద్దు నిర్ణయాన్ని అతిపెద్ద విషాదంగా పేర్కొంటూ ప్రధాని మోదీ చర్యలను తీవ్రంగా తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయని, జీడీపీ దెబ్బతింటుందని, ఉద్యోగాల కల్పన తగ్గుతుందని అన్నారు. అంతేగాక, భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని మన్మోహన్ సింగ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భారతీయ వ్యక్తి విశ్వసనీయతకు తీవ్రమైన గాయాన్ని చేసిందన్నారు. నల్లకుబేరులకు అతి తక్కువ నష్టం మాత్రమే కలుగుతోందని చెప్పారు.