: విమానంలో జగన్, అచ్చెన్నాయుడు, కేఈ, ప్రత్తిపాటి పక్కపక్కనే ఉన్న వేళ... కుశల ప్రశ్నలు.. సరదా కబుర్లు!

పొద్దున లేచింది మొదలు, ఒకరిని ఒకరు విమర్శించుకోనిదే గానీ రాత్రి నిద్రపోని రాజకీయ నేతలు వారు. అది బయటకు మాత్రమే. పర్సనల్ లైఫ్ లో ఒకరిని ఒకరు కలిసిన వేళ, ఆప్యాయంగా పలకరించుకుంటారు. ఆపై నలుగురిలోకి వస్తే మళ్లీ మామూలే. ఈ టాపిక్ ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా? ఇటీవల ఓ విమానంలో విపక్ష నేత వైఎస్ జగన్, అధికార పక్షం నేతలు కేఈ కృష్ణమూర్తి, అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావులు ఒకే విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం బయలుదేరారు. అచ్చెన్నాయుడు, జగన్ కు పక్కపక్క సీట్లు రాగా, వీరి ముందు వరుసలో రాష్ట్ర 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ సాయిబాబా, వెనుక మంత్రులు ప్రత్తిపాటి, కేఈలు ఉన్నారు. తొలుత సాయిబాబాను పలకరించిన జగన్, మీడియా అంతా నువ్వే కనిపిస్తూ, మమ్మల్ని ఏకిపారేస్తున్నావని గుర్తు చేశారట. ఆపై "పుల్లన్న, అచ్చెన్నా నమస్కారం" అంటుండగా, తనను పలకరించలేదని కాస్తంత కోపాన్ని ప్రదర్శిస్తున్నట్టు చూస్తూ, "ఏమయ్యా జగన్.. నీకు ఉత్తరాంధ్ర, కోస్తావాళ్లే కనిపిస్తారా?" అని కేఈ అడుగగా, "పెద్దాయనా..." అంటూ ఆప్యాయతతో పలకరించిన జగన్, "మిమ్మల్ని చూడలేదు. హరి ఎలా ఉన్నాడు?" అని తన క్లాస్ మేట్, కేఈ కుమారుడు హరి గురించి అడిగారు. ఇక ఇలా నేతలంతా కలివిడిగా మాట్లాడుకుంటుండటాన్ని చూసిన ఇతర ప్రయాణిణులు కాస్తంత ఆశ్చర్యపోయారట. ఆపై విమానం గన్నవరంలో ఆగగానే, బయటకు వచ్చిన నేతల ముఖాల్లో సీరియస్ నెస్ వచ్చేయగా, మంత్రులు వెలగపూడికి, జగన్ బందరుకు వెళ్లారట. ఇలా వీరు ఆకాశంలోనే హాయ్, బాయ్ చెప్పుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు.

More Telugu News