: ట్రంప్ వచ్చాడు... అణ్వాయుధాలు పెంచాలి: చైనా

అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో చైనా అధికార పత్రికలో ఓ సంచలనాత్మక కథనం ప్రచురితమైంది. అమెరికాను, ముఖ్యంగా ట్రంప్ ను ఎదుర్కొనేందుకు అణ్వస్త్రాలను పెంచుకోవాల్సి వుందని, రక్షణ రంగానికి కేటాయిస్తున్న బడ్జెట్ ను సైతం పెంచాలని ‘గ్లోబల్ టైమ్స్’ పత్రిక‌ వ్యాఖ్యానించింది. వ్యూహాత్మకంగా అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సి వుందని, దీంతో పాటు దేశవాళీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి డీఎఫ్-41ను మరింతగా అభివృద్ధి చేయాలని సూచించింది. ట్రంప్ చైనాను లక్ష్యంగా చేసుకోవాలని చూస్తే, ఆ ప్రభావం నుంచి రక్షించుకునేందుకు అణ్వస్త్ర సామర్థ్య పెంపు సహకరిస్తుందని వెల్లడించింది. కాగా, చైనా తమకు శత్రువని ట్రంప్ వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో చైనాకు శత్రువైన తైవాన్ ను అమెరికా దగ్గరకు తీస్తుండటం కూడా చైనాకు కంటగింపుగా మారింది. ఈ విషయంలో అమెరికా వైఖరిని చైనా బహిరంగంగానే తప్పుబట్టినప్పటికీ, అమెరికా పట్టించుకోలేదు.

More Telugu News