: మెరీనా బీచ్ లో సమాధి వద్ద జయ స్మారకం...ఫిబ్రవరి 24 నాటికి పూర్తి

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జన్మదినం నాటికి ఆమె సమాధి వద్ద స్మారక చిహ్నాన్ని పూర్తి చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కాగా, జయలలిత జయంతి ఫిబ్రవరి 24న జరగనుంది. అప్పటికి మెరీనా బీచ్ లో ఎంజీఆర్ స్మారకం సమీపంలో ఉన్న జయలలిత సమాధి చుట్టూ అద్భుతమైన స్మారక స్థూపం నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే మూడు రకాల నమూనాలను ఎంపిక చేసినట్టు అధికారులు వెల్లడించారు. పార్టీ వర్గాలతో డిజైన్ ను ఆమోదింపజేసుకుని, చలువరాళ్లతో దీనిని నిర్మించనున్నట్టు తెలుస్తోంది. దీనిని ఆమె తొలి జయంతి నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఆమె సమాధిని దర్శించుకునేందుకు అభిమానులు పోటెత్తుతున్న సంగతి తెలిసిందే.

More Telugu News