: ముంబైలో దారుణం... ఎదురు తిరిగిందని యువతిని ట్రైన్ కిందకి తోసేసిన చైన్ స్నాచర్

ముంబైలో దారుణం చోటుచేసుకుంది. కుర్లా స్టేషన్‌ లోని ఒకటో నెంబరు ప్లాట్‌ ఫాంపై చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే...బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లోని 'హెచ్డీఎఫ్సీ లైఫ్' సంస్థలో పని చేసే 24 ఏళ్ల యువతి ట్రైన్‌ కోసం ఎదురు చూస్తుండగా, అటుగా వచ్చిన చైన్ స్నాచర్ ఆమె మెడలోని గోలుసు లాగేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన ఆ యువతి అతనిని సమర్థవంతంగా అడ్డుకుంది. ఈ హఠాత్పరిణామంతో బిత్తరపోయిన దొంగ...ఆమెను బలంగా తోసేశాడు. దీంతో ఆ యువతి పట్టుతప్పి పట్టాలపై పడిపోయింది. అదే సమయంలో లోకల్ ట్రైన్ వేగంగా రావడంతో పట్టాల మధ్య పడిన ఆమె నలిగిపోయి ప్రాణాలు కోల్పోయింది. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసేందుకు ఉద్యుక్తులవుతుండగా, రంగప్రవేశం చేసిన రైల్వే పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఉపాధి కోసం ఒడిశా నుంచి ముంబై చేరుకున్న ఆ యువకుడు పని దొరక్కపోవడంతో సొంత ఊరు వెళ్తూ, ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించారు. అయితే, తాను ఆమెను తోసేయలేదని, ఆమే పడిపోయిందని నిందితుడు చెప్పడం విశేషం.

More Telugu News