: మోదీది ఒక్క శత్రువును చంపడానికి 100 మంది మిత్రులను చంపే క్రూర మనస్తత్వం: సీపీఐ నారాయణ

ప్రధాని నరేంద్ర మోదీది ఒక్క శత్రువును చంపేందుకు 100 మంది మిత్రులను చంపేంత క్రూరమైన మనస్తత్వమని సీపీఐ నారాయణ అన్నారు. నోట్ల రద్దుపై ఆయన మాట్లాడుతూ, కష్టపడి సంపాదించిన డబ్బులు, రెక్కలు ముక్కలు చేసుకుంటే నెలాఖరున రావాల్సిన జీతం కోసం క్యూలైన్లలో పడిగాపులు కాయడమేంటని అన్నారు. మన డబ్బులు మనం తీసుకోవడానికి ప్రభుత్వాన్ని అనుమతి అడగడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉన్న ఎవరిని అడిగినా ఇది నల్లధనంపై పోరాటం కాదని చెబుతున్నారని ఆయన అన్నారు. అసలు ఇంతవరకు నల్లధనం కేంద్రం వద్దకు ఎంత చేరిందన్న లెక్కలు కూడా లేవని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని సామాన్య ప్రజలను హింస పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. కనీసం మోదీ చెప్పినట్టు ఎంత మంది నల్లకుబేరులు బ్యాంకు క్యూలైన్లలో నిల్చున్నారని ఆయన ప్రశ్నించారు. ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడు చంపేస్తాననడం ఎంతవరకు న్యాయమని ఆయన నిలదీశారు.

More Telugu News