: మంత్రి కామినేని సవాల్ ను స్వీకరిస్తున్నాం.. చర్చా వేదిక ఎక్కడో చెప్పాలి: అంబటి రాంబాబు

ఏపీలో ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరుపై చర్చించేందుకు సిద్ధమన్న మంత్రి కామినేని శ్రీనివాసరావు సవాల్ ను స్వీకరిస్తున్నామని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఏపీలో ఈ పథకం అమలు తీరుపై చర్చించేందుకు తేదీ, సమయంతో పాటు వేదిక వివరాలను రేపు సాయంత్రంలోగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ పథకంలో కమీషన్లు రావు కనుకనే చంద్రబాబు ఈ పథకాన్ని పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. వైద్యం అందక పేదలు అల్లాడుతున్నారని, ఈ పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద రేపు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేయనున్నట్లు అంబటి పేర్కొన్నారు. తాము ధర్నా చేస్తామని ప్రకటించిన తర్వాతే అరకొర నిధులు విడుదల చేశారన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎలుకలు, చీమల కారణంగానే శిశువులు మృతి చెందారని, ఈ విషయమై మంత్రి కామినేని సిగ్గుతో తలదించుకోవాలని అంబటి విమర్శించారు.

More Telugu News