: ముగిసిన తొలిరోజు ఆట...ఇంగ్లండ్ 288/5

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు తొలిరోజు ఆటముగిసింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో, ఓపెనర్లు కెప్టెన్ కుక్ (46), జెన్నింగ్స్ (112) అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. దీంతో సిరీస్ లో తొలిసారి ఇంగ్లండ్ జట్టు కుదురుకున్నట్టు కనిపించింది. అయితే జడేజా సంధించిన అద్భుతమైన బంతికి కుక్ పెవిలియన్ చేరాడు. అనంతరం రూట్ (21) కుదురుకున్నట్టే కనిపించినా అశ్విన్ మాయాజాలానికి బోల్తా కొట్టాడు. తరువాత వచ్చిన మొయిన్ అలీ (50) జెన్నింగ్స్ తో కలిసి కుదురుకున్నాడు. అర్ధసెంచరీ సాధించి ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించేందుకు బాటలు వేశాడు. తరువాత స్వీప్ షాట్ కు యత్నించి కరుణ్ నాయర్ చేతికి చిక్కాడు. అనంతరం సెంచరీ సాధించిన జెన్నింగ్స్ కు గుడ్ లెంగ్త్ బంతిని సంధించిన అశ్విన్ ఫలితం రాబట్టాడు. పుజారా చక్కని క్యాచ్ అందుకోవడంతో ఇంగ్లండ్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. అనంతరం బెయిర్ స్టో (2)కు ఊరించే బంతిని సంధించిన అశ్విన్ ఉచ్చులో పడి పెవిలియన్ చేరాడు. దీంతో క్రీజులో బెన్ స్టోక్స్ (25), జోస్ బట్లర్ (18) క్రీజులో ఉన్నారు. దీంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు 94 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లతో రాణించగా, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీసి అతనికి చక్కని సహకారమందించాడు. 30 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్విన్ నాలుగు వికెట్లు తీయడం విశేషం.

More Telugu News