: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఈ-పాస్ యంత్రాలు ఏర్పాటు

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఈ-పాస్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చామని ఆలయ ఈవో సూర్యకుమారి తెలిపారు. పెద్దనోట్ల రద్దు కారణంగా భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకే ఈ ఏర్పాటు చేశామని చెప్పారు. టికెట్ కౌంటర్, ఆర్జిత సేవ కౌంటర్ తో పాటు అన్నదాన కేంద్రం వద్ద ఈ యంత్రాలను సిద్ధంగా ఉంచామని అన్నారు. డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఆయా కౌంటర్లలో టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చని, విరాళాలు సైతం ఈ కార్డుల ద్వారా చెల్లించవచ్చని చెప్పారు. ఆలయ ప్రాంగణంలో సిగ్నల్ సమస్య తలెత్తని చోట్లనే ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ సౌకర్యాన్ని భక్తులందరూ వినియోగించుకోవాలని సూర్యకుమారి సూచించారు.

More Telugu News