: తుపాను భయం.. వస్తుందో? రాదో? తెలియక అయోమయం!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్టాల పరిస్థితి అయోమంగా ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రమై తీరంవైపు దూసుకొస్తుండడంతో ఆందోళన నెలకొంది. అయితే ఇది తుపానుగా మారుతుందా? లేదా? అన్న విషయాన్ని వాతావరణశాఖ అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. మరోవైపు వాయుగుండం ప్రభావంతో అండమాన్ దీవుల్లో కుంభవృష్టి కురిసింది. దీంతో అక్కడ దాదాపు అన్ని వ్యవస్థలు స్తంభించి పోయాయి. హేవ్లాక్ సహా ఇతర దీవుల్లో 1400 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు భారత నౌక ఒకటి రంగంలోకి దిగింది. వాయుగుండం దక్షిణ కోస్తా దిశగా పయనిస్తోందని బుధవారం రాత్రి వాతావరణశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. బుధవారం 5:30 గంటల నుంచి 12 గంటలపాటు ఈ వాయుగుండం ఉత్తరంగా పయనిస్తుందని, ఆ తర్వాత కొద్దిగా దిశమార్చుకుని వచ్చే నాలుగు రోజులు వాయవ్యంగా పయనిస్తుందని పేర్కొన్నారు. దీనినిబట్టి చూస్తే వాయుగుండం గురువారానికి తీవ్రంగా మారి శుక్రవారం తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు భావిస్తున్నారు. 10వ తేదీ నుంచి కోస్తాలో దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో తుపాను తీవ్రతపై వస్తున్న వదంతులను నమ్మవద్దని వాతావరణశాఖ కోరింది.

More Telugu News