: ఈ ఏటి బెస్టు ట్వీట్.. కోహ్లీ ట్వీటే!

టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం మైదానంలోనే కాదు, ట్విట్టర్‌ లో కూడా అగ్రస్థానంలో నిలిచాడు. ముగిసిపోతున్న ఈ ఏడాదిలో అత్యంత ప్రభావవంతమైన ట్వీట్లను ట్విట్టర్‌ ఇండియా విడుదల చేసింది. ఈ జాబితాలో అత్యంత ప్రభావవంతమైన ట్వీట్‌ గా అనుష్కను ఉద్దేశించి కోహ్లి చేసిన ట్వీట్‌ నిలిచింది. 'గోల్డన్‌ ట్వీట్‌ ఆఫ్‌ ది ఇయర్‌' ఘనతను సొంతం చేసుకుంది. విరాట్ కోహ్లీ పీకల్లోతు ప్రేమలో ఉండగా, టీ20 వరల్డ్ కప్ జరిగింది. అంతకు ముందు అత్యుత్తమ ఫాంలో ఉన్న కోహ్లీ పరుగుల వరద పారించాడు. దీంతో వరల్డ్ కప్ లో కోహ్లీ ప్రదర్శనపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ దశలో టీమిండియా ఆడుతున్న మ్యాచ్ లు చూసేందుకు అనుష్క శర్మ మైదానానికి వచ్చేది. అలా ఆమె వచ్చిన ప్రతి మ్యాచ్ లోనూ కోహ్లీ విఫలమయ్యాడు. దీంతో ఇది జట్టు ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో అభిమానులు భగ్గుమన్నారు. అనుష్కను ఐరన్ లెగ్ గా పోలుస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కోహ్లీ వైఫల్యానికి అనుష్కే కారణమని నిందించారు. ఇది పతాక స్థాయికి చేరుకోవడంతో స్పందించిన కోహ్లీ, తన ట్విట్టర్ వాల్ పై 'షేమ్' అనే ఇమేజ్ ను ఉంచి, 'నిరంతరం ఆమెను ఆడిపోసుకుంటున్న మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నా. కొంచెం కనికరం చూపండి. ఆమె ఎప్పుడూ నాకు సానుకూలతనే అందజేసింది' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ట్వీట్ స్క్రీన్ షాట్ గా మారి ఫేస్ బుక్ లో కూడా హల్ చల్ చేసింది, ఇది రికార్డు స్థాయిలో 39 వేల సార్లు రీట్వీట్‌ అయింది. అంతే కాకుండా ఈ ట్వీట్ ను లక్షా ఏడు వేల మంది లైక్ చేశారు. ఈ క్రమంలో ఇది పెద్ద నోట్ల రద్దు కోసం ప్రధాని మోదీ చేసిన ట్వీట్ ను కూడా బీట్ చేసేసింది. దీంతో బెస్ట్ ట్వీట్ ఆఫ్ ది ఇయర్ ట్వీట్ గా రికార్డులకెక్కింది. దాని తరువాతి స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ నిలిచింది. మూడో స్థానంలో 2016 టీ20 వరల్డ్‌ కప్‌ లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సందర్భంగా హల్ చల్ చేసిన ట్వీట్లు నిలిచాయి. ఈ మ్యాచ్‌ లో కోహ్లీ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే!

More Telugu News