: బర్త్ డే ఇలా కూడా చేసుకోవచ్చా?.. కారు అద్దాలు పగలగొట్టి పైశాచిక ఆనందం పొందిన యువకులు!

రోడ్డుపై పార్క్ చేసిన కార్ల అద్దాలు పగలగొట్టి పుట్టినరోజు వేడుకలు జరుపుకుని పైశాచిక ఆనందం పొందారు కొందరు యవకులు. పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని మయూరినగర్‌ వాసి అరవింద్ సోమవారం తన పుట్టిన రోజు వేడుకలను స్నేహితులతో కలిసి జరుపుకోవాలని నిర్ణయించుకున్నాడు. స్నేహితులైన శివరాం, వినయ్, విష్ణువర్ధన్, అబ్దుల్, ముఖేశ్‌లను ఆహ్వానించి అందరూ కలిసి పార్టీ చేసుకున్నారు. అనంతరం బైక్‌లతో రోడ్డుపైకి వచ్చారు. సిగ్నోడ్ కాలనీ, సాయికాలనీలో ఆగి ఉన్న మూడు కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం బీహెచ్ఈఎల్ హెచ్ఐజీలో మరో 5 కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. తర్వాత బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌లో రోడ్డుపై వెళ్తున్న కారును అడ్డగించారు. అందులో ఉన్న రాజేశ్ అనే యువకుడిని బయటకు లాగి చితకబాదారు. వీరంతా బీటెక్ విద్యార్థులని, 25 ఏళ్ల లోపు వారని సీఐ భాస్కర్ తెలిపారు. యువకులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు.

More Telugu News