: 'అమ్మ'కు జనసేన నీరాజనం... అంజలి ఘటించిన పవన్ కల్యాణ్

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు జనసేనాని, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పార్టీ తరపున ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. విప్లవనాయకి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పవన్ తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి తిరిగి ఇంటికి చేరుకుంటారని దేశ ప్రజలందరితో పాటు తాను కూడా ఆశించానని... అయితే మనల్ని అందరినీ తీవ్ర దు:ఖంలో వదిలి, తిరిగిరాని లోకాలకు ఆమె వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు, భారతదేశ రాజకీయాలపై మూడు దశాబ్దాలకు పైగా ఆమె చెరగని ముద్ర వేశారని పవన్ తెలిపారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ఆశగా, శ్వాసగా ఆమె బతికారని కొనియాడారు. తమిళ ప్రజలు ప్రేమతో 'అమ్మ'గా పిలుచుకునే జయ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సదా ఆచరణీయమని చెప్పారు. మహిళల ప్రబల శక్తికి జయలలిత నిదర్శనమని అన్నారు. అమ్మ మరణం తమిళనాడుకే కాకుండా... యావత్ దేశానికి తీరని లోటు అని చెప్పారు. తన తరపున, జనసేన పార్టీ తరపున జయలలితకు మన:పూర్వక అంజలి ఘటిస్తున్నానని పవన్ తెలిపారు.

More Telugu News