: అంతా సీక్రెటే... జయ నివాసం ఓ గండికోట రహస్యం!

పోయస్ గార్డెన్. ఈ పేరు చెబితేనే చెన్నైలోని వీవీఐపీల ఇళ్లన్నీ గుర్తుకు వస్తాయి. వాటిల్లో మొదట చెప్పే పేరు 'వేద నిలయం'. తన తల్లి వేదవల్లి గుర్తుగా, జయలలిత 1967లో రూ. 1.32 లక్షలకు కొనుగోలు చేసిన ఇల్లు. దాదాపు 24 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఇంటి విలువ ఇప్పుడైతే రూ. 45 కోట్లకు పైమాటే. ఇక ఈ ఇంటికి పొరుగున ఉండేది సూపర్ స్టార్ రజనీకాంత్ ఇల్లు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే 'వేద నిలయం'లో ఎన్నో రహస్యాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇందులోకి వెళ్లాలంటే జయలలిత అనుమతి తప్పనిసరి. ఏదైనా ప్రత్యేక ప్రోగ్రాం ఉంటే తప్ప, మంత్రులకు సైతం ఈ బిల్డింగ్ లోకి ప్రవేశం నిషిద్ధమే. జయకు ముఖ్యనేతలు, విశ్వాసపాత్రులైన ఐఏఎస్ లకు సైతం ఇల్లంతా ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఈ ఇంట్లో 20 మందికి పైగా పనివాళ్లు ఉంటారని సమాచారం. జయతో పాటు శశికళ, ఆమె మరదలు ఇళవరసి, 20 సంవత్సరాల వయసులో ఉన్న ఇద్దరు యువతులు ఇక్కడుంటారు. వీరిని ప్రధాని నరేంద్ర మోదీ పంపినట్టు గుసగుసలు వినిపిస్తుంటాయి. జయ తీసుకోవాల్సిన మాత్రల నుంచి మేకప్ వరకూ వీరిద్దరే చూసుకుంటారని తెలుస్తోంది. ఇక ఇంటి ఆవరణలోనే ఓ చిన్న గుడి వుంది. జయలలిత ఇంట్లోకి వెళ్లాలన్నా, బయటి నుంచి ఇంట్లోకి వచ్చినా, ఈ వినాయకుడి దర్శనం తప్పనిసరి.

More Telugu News