: జయలలితకు పొరపాటున శ్రద్ధాంజలి ఘటించి... నాలుక్కరుచుకున్న తెలుగు నటులు

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి సామాన్యుడి దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రతి ఒక్కరు కూడా వదంతులను నమ్మే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే... సోషల్ మీడియాలో జయకు సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. మన తెలుగు సినీ ప్రముఖులు సైతం పొరపాటున... జయలలితకు ముందుగానే శ్రద్ధాంజలి ఘటించారు. సీనియర్ నటుడు మోహన్ బాబు స్పందిస్తూ, ఈ లోటును ఎలా వ్యక్తీకరించాలో కూడా తెలియడం లేదని... ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. యువ హీరో సందీప్ కిషన్ స్పందిస్తూ, తమిళనాడులోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన ముఖ్యమంత్రి ఇకలేరని... 'అమ్మా, మీ ఆత్మకు శాంతి చేకూరాలి' అని ట్వీట్ చేశాడు. ఇదే రీతిలో కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా స్పందించాడు. అయితే, జయకు ఇంకా వైద్యం అందిస్తున్నామంటూ అపోలో యాజమాన్యం ప్రకటన విడుదల చేయడంతో... మోహన్ బాబు తన ట్వీట్ ను తొలగించారు. వెన్నెల కిషోర్ తన ట్వీట్ ను తొలగించి... అపోలో హెల్త్ బులెటిన్ పత్రాన్ని అప్ లోడ్ చేశాడు. సందీప్ కిషన్ కూడా తన ట్వీట్ ను మార్చివేశాడు.

More Telugu News