: పార్లమెంటులోని ఏటీఎంలే పని చేయకపోతే...ఇక సుదూర ప్రాంతాల్లోనివి ఎలా పని చేస్తాయి?: గులాం నబీ ఆజాద్
పార్లమెంటు లైబ్రరీ వద్దనున్న ఏటీఎం, పార్లమెంటు లోపలున్న ఏటీఎం రెండూ పని చేయడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. రాజ్యసభలో జీరో అవర్ లో ఆయన మాట్లాడుతూ, సాక్షాత్తూ పార్లమెంటులోని ఏటీఎంలే పని చేయకపోతే... సుదూర ప్రాంతాల్లోని ఏటీఎంలు పని చేస్తున్నాయని ఎలా భావిస్తామని ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించినట్టుందని ఆయన ఆరోపించారు. దేశంలో ఎవరూ తమకు సరిపడినంత డబ్బు తీసుకోలేని పరిస్థితి నెలకొందని, ఇదేం విధానమని ఆయన ప్రశ్నించారు. ఇలా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం సరికాదని ఆయన సూచించారు. తీసుకున్న ఏ నిర్ణయమైనా ప్రజా శ్రేయస్సును కాంక్షించేదై ఉండాలని, ఈ నిర్ణయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు.