: బంధువులు ఎక్కేవరకు విమానం బయల్దేరేది లేదని భీష్మించిన మంత్రి బంధువులు: క్షమాపణలు చెప్పిన జెట్ ఎయిర్ వేస్

సాంకేతికలోపం కారణంగా జరిగిన పొరపాటు జెట్ ఎయిర్ వేస్ సిబ్బందిని పడరాని పాట్లు పడేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే... ముంబై నుంచి భోపాల్ వెళ్లాల్సిన జెట్ ఎయిర్ వేస్ విమానంలో సాంకేతిక లోపం కారణంగా కెపాసిటీని మించి 17 సీట్లు అదనంగా బుక్ అయ్యాయి. షెడ్యూల్ ప్రకారం ఉదయం 5.55 నిమిషాలకు బయల్దేరాల్సిన విమానం సమయానికే తలుపులు మూసుకున్నాయి. పెళ్లి బృందానికి చెందిన 63 మంది విమానంలో ఎక్కగా, మరో 17 మంది బయట ఉండిపోయారు. వారికి కూడా టికెట్లు బుక్ చేశామని, వారిని కూడా విమానంలో ఎక్కించాలని, వారు ఎక్కేవరకు విమానాన్ని బయల్దేరనిచ్చేది లేదని వారు భీష్మించుకుని కూర్చున్నారు. తలుపులకు అడ్డంగా నిలబడ్డారు. వారంతా గుజరాత్ కు చెందిన సీనియర్ మంత్రి బంధువులు కావడంతో విమానసిబ్బందికి ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో తరువాతి విమానంలో వచ్చేవారికి సీట్లు ఏర్పాటు చేయడంతో పాటు 10 వేల రూపాయల పరిహారం ఇస్తామని జెట్ ఎయిర్ వేస్ అధికారులు ప్రకటించారు. దీనికి ఐదుగురు ప్రయాణికులు స్పందించారు. వారంతా తమ సీట్లను ఖాళీ చేయడంతో మిగిలిన 12 మండి విమానం బయట ఉండిపోయారు. వారు కూడా విమానంలో రావాల్సిందేనని మిగిలిన వారు డిమాండ్ చేయడంతో ఏం చేయాలో పాలుపోని విమాన సిబ్బంది.. లాఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు సమాచారం అందించారు. వారు రంగప్రవేశం చేసి, పరిస్థితిని చక్కదిద్దడంతో 8 గంటలకు ఎట్టకేలకు విమానం బయల్దేరింది. జరిగిన ఆలస్యానికి సిబ్బంది ప్రయాణికులకు క్షమాపణలు చెప్పారు. అనంతరం విమానం బయల్దేరింది. ఈ తతంగం మొత్తాన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది వెలుగులోకి వచ్చింది.

More Telugu News