: సినిమాలు చూసి త‌న్నుకు చచ్చే ప‌రిస్థితులు ఇప్పుడు అస్సలు లేవు: దేవినేని నెహ్రూ

నిజజీవిత సంఘటనల ఆధారంగా తీసిన సినిమాలను చూసి పాతక‌క్ష‌ల‌ను గుర్తుకు తెచ్చుకొని త‌న్నుకు చచ్చే ప‌రిస్థితులు ఇప్పుడు అస్సలు లేవని దేవినేని నెహ్రూ అన్నారు. విజయవాడలో త‌న‌తో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు మ‌ధ్యాహ్నం భేటీ అయిన అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో వివాదాస్ప‌ద‌మైన వంగ‌వీటి సినిమా గురించి దేవినేని నెహ్రూ మాట్లాడారు. ఇప్పుడు అంద‌రూ బిజీబిజీగా బ‌తుకుతున్నార‌ని, అటువంటి ప్ర‌జ‌లు సినిమాల్లో చూపించే వాటిని ప‌ట్టించుకోరని దేవినేని నెహ్రూ అన్నారు. సినిమాలో తన పాత్ర గురించి వ‌ర్మ వీడియో క్లిప్ చూపిస్తూ ఓ మేకప్ వేసిన మ‌నిషిని చూపించాడని దేవినేని నెహ్రూ అన్నారు. ఆ వీడియో చూశాక‌ ఆ వ‌య‌సులో తాను అలాగే ఉన్నానులే అని అనుకున్నానని చెప్పారు. వ‌ర్మ సినిమా మొత్తం చూపించ‌లేదని అన్నారు. సినిమాలో త‌న‌ను వేరే విధంగా చూపించినా తాను ఎటువంటి వాడినో ప్ర‌జ‌ల‌కి తెలుసని, త‌న‌ను సిగ‌రేట్ తాగే వాడిలా చూపించారని, తన తాత‌ల కాలం నుంచి కూడ సిగ‌రేట్ తాగే అలవాటు త‌మకు లేదని, కనీసం టీ, కాఫీలు కూడా తాగమని, వక్కపొడి కూడా నోట్లో వేసుకోమని నెహ్రూ అన్నారు.

More Telugu News