: చాలా కాలం తర్వాత కనిపించిన వంగవీటి రంగా భార్య రత్నకుమారి

వంగవీటి మోహన రంగా భార్య, మాజీ ఎమ్మెల్యే రత్నకుమారి చాలా కాలం తర్వాత కనిపించారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న ఆమె... ఆ తర్వాత పబ్లిక్ గా కనిపించిన సందర్భాలు చాలా అరుదు. కనీసం ఫంక్షన్లకు కూడా ఆమె హాజరుకాలేదు. విజయవాడలోనే ఉన్న రత్నకుమారిని గత కొన్ని ఏళ్లుగా స్థానికులు చూడటం దాదాపుగా లేదనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో, ఈ రోజు ఆమె అందరి ముందుకు వచ్చారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన 'వంగవీటి' సినిమా ఆడియోను ఈ సాయంత్రం విజయవాడలో లాంచ్ చేయనున్నారు. ఈ సందర్భంగా, రంగారాధ మిత్రమండలి ఈ సినిమా విడుదలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అంతేకాదు, రంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ కూడా ఈ సినిమాపై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో, రంగా కుటుంబసభ్యులతో విజయవాడలోని ఓ ఆసుపత్రిలో వర్మ భేటీ అయ్యారు. ఈ భేటీకి రత్నకుమారి కూడా వచ్చారు. తన కుమారుడు రాధా పక్కన కూర్చొని వర్మతో చర్చించారు. అయితే, వీరు ఏం చర్చించారనే దానికి సంబంధించిన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

More Telugu News