: ఒకనాడు మోదీ ప్రశంసించిన యువ ఇంజినీర్... ఇప్పుడు దొంగనోట్ల కేసులో బుక్కయ్యాడు!

అతనో తెలివైన యువ ఇంజినీర్. గత ఏడాది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో అతను చూపిన ప్రతిభకు ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఎంతగానో ప్రశంసించారు. ఇప్పుడు మోదీ ప్రవేశపెట్టిన కొత్త రూ. 2000ల దొంగనోట్లను ముద్రించి, చలామణి చేస్తూ, చండీగఢ్ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళ్తే, అభినవ్ వర్మ అనే యువ ఇంజినీర్ ను దొంగనోట్లు ముద్రించినందుకు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 42 లక్షల విలువైన దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీవీఐపీలు మాత్రమే వాడే ఎర్రబుగ్గ ఆడీ కారులో అతను వెళ్తుండగా... పోలీసులు ఆపి తనిఖీ చేశారు. దీంతో, రూ. 42 లక్షల దొంగనోట్లు పట్టుబడ్డాయి. ఈ సందర్భంగా అభినవ్ తో పాటు మరో ఇద్దరు గ్యాంగ్ సభ్యుల్ని అరెస్ట్ చేశారు. వీరు ముగ్గురూ పాత 500, 1000 నోట్లను తీసుకుని, 30 శాతం కమిషన్ తో రూ. 2000 నోట్లను ఇస్తున్నారు. అయితే, వీరు ఇస్తున్నది మాత్రం దొంగనోట్లే. ఇది తెలియక ఎంతమంది వీరి బుట్టలో పడ్డారో ఎవరికీ తెలియదు.

More Telugu News