: ఢిల్లీ ఫైవ్‌స్టార్ హోట‌ల్లో అమెరికా మహిళపై గ్యాంగ్‌రేప్‌.. ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసిన బాధితురాలు!

దేశ రాజ‌ధాని ఢిల్లీలోని క‌న్నాట్‌ప్లేస్‌లో ఉన్న ఓ ఫైవ్‌స్టార్ హోట‌ల్లో త‌న‌పై సామూహిక అత్యాచారం జ‌రిగింద‌ని అమెరికాకు చెందిన ఓ మహిళ ఆరోపించింది. టూరిస్ట్ గైడ్ స‌హా ఐదుగురు త‌నను దారుణంగా రేప్ చేశార‌ని పేర్కొంది. ఈ ఘ‌ట‌న‌పై ఈమెయిల్ ద్వారా మ‌హిళ నుంచి ఫిర్యాదు అందుకున్న‌ట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే ఎఫ్ఐఆర్ న‌మోదు చేశాక ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసేందుకు మ‌హిళ ఢిల్లీ రావాల్సి ఉంటుంద‌ని తెలిపారు. మ‌హిళ త‌న ఫిర్యాదును స‌వివ‌రంగా ఈమెయిల్ ద్వారా పోలీస్ క‌మిష‌న‌ర్ అధికారిక అకౌంట్‌కు పంపిన‌ట్టు పేర్కొన్నారు. పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం.. మార్చి 2016న టూరిస్ట్ వీసాపై ఢిల్లీ వ‌చ్చిన అమెరికా మ‌హిళ క‌న్నాట్‌ప్లేస్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోట‌ల్లో దిగింది. హోట‌ల్ సిబ్బంది స‌ల‌హా మేర‌కు ఆమె ఓ టూరిస్ట్ గైడ్‌ను నియ‌మించుకుంది. అతడు ఢిల్లీ మొత్తం తిప్పి చూపించాడు. ఓ రోజు రూట్‌మ్యాప్ కోసం చ‌ర్చించేందుకు ఆమె ఉంటున్న హోట‌ల్‌కు మ‌రో న‌లుగురితో క‌లిసి గైడ్ వ‌చ్చాడు. వ‌స్తూవ‌స్తూ మ‌ద్యం కూడా తెచ్చుకున్నారు. ఆ త‌ర్వాత గైడ్ మ‌హిళ‌ను బ‌లవంతంగా లొంగదీసుకుని రేప్ చేశాడు. త‌ర్వాత మిగ‌తా నలుగురు కూడా అత్యాచారానికి పాల్ప‌డ్డారు. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన మ‌హిళ అమెరికా వెళ్లిపోయి కుటుంబ స‌భ్యుల‌కు జ‌రిగిన విష‌యం చెప్పింది. ఆ త‌ర్వాత త‌న లాయ‌ర్ ఫ్రెండ్ ద్వారా ఓ ఎన్జీవోను కలిసి త‌న గోడు వెళ్ల‌బోసుకుంది. వారు ఈమెయిల్ ద్వారా ఢిల్లీ పోలీస్ క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదు చేయ‌మ‌ని స‌ల‌హా ఇవ్వ‌డంతో మెయిల్ పంపింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆమెకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు పంపాల్సిందిగా అమెరికా రాయ‌బార కార్యాల‌యాన్ని కోరారు.

More Telugu News