: తాగిపడిపోతే చనిపోయాడని మార్చురీలో పెట్టారు... అర్ధరాత్రి లేచి నేరుగా పబ్ కెళ్లిపోయాడు!

నిజజీవితంలో కొన్ని తమాషా సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. అలాంటి ఘటనే పోలండ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... పోలండ్ కి చెందిన కమిల్ అనే వ్యక్తి స్నేహితులతోపాటు పబ్ కెళ్లాడు. అక్కడ పీకల్దాక ఓడ్కా తాగిన కమిల్ స్నేహితుల కళ్లముందే పడిపోయాడు. అతనిని ఎంత లేపినా లేవలేదు. దీంతో గుండెపోటు వచ్చిందని భావించిన స్నేహితులు అతనిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు అతను బాగా తాగడంతో గుండెపోటుతో మరణించాడని తేల్చేశారు. దీంతో అతనిని మార్చురీకి తరలించారు. తర్వాత అర్ధరాత్రి మార్చురీలోంచి శబ్దాలు రావడంతో వణికిపోతూ గార్డు తలుపు తీయగానే, 'బాగా చలిగా ఉంది. దుప్పటి కావాలి' అంటూ నగ్నంగా ఉన్న కమిల్ అడిగాడు. దీంతో బెంబేలెత్తిపోయిన గార్డు అతనికి దుప్పటి ఇచ్చి, వైద్యులు, పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో అతను ఓడ్కా కారణంగా ఒళ్లు తెలీనంతగా నిద్రపోయాడని, ఆ మత్తులోనే బట్టలు కూడా విప్పేసుకున్నాడని తెలిపారు. ఫార్మాలిటీస్ పూర్తి చేసిన అనంతరం అతనిని డిచ్చార్జ్ చేయగా, కమిల్ నేరుగా మళ్లీ పబ్ కు వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు.

More Telugu News