: రాంగోపాల్ వర్మకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన 'రాధా రంగా మిత్రమండలి'

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు 'రాధా రంగా మిత్రమండలి' సభ్యులు తీవ్ర హెచ్చరికలు చేశారు. విజయవాడలో వారు మాట్లాడుతూ, రాంగోపాల్ వర్మ తాజా సినిమా 'వంగవీటి'లో వంగవీటి రంగా కుటుంబాన్ని కించపరిచేలా చూపిస్తే కనుక సహించేది లేదని అన్నారు. వాస్తవాలను తీస్తే అభ్యంతరం లేదని, అలా కాకుండా ఏమాత్రం అవాస్తవాలు చూపించినా, ఆ సినిమాను ప్రదర్శించే థియేటర్ల వద్ద ఉద్రిక్తతలు తలెత్తుతాయని హెచ్చరించారు. అయితే, ఈ సినిమాలో వక్రీకరించినట్టు తమ వద్ద సమాచారం ఉందని వారు తెలిపారు. థియేటర్ల వద్ద తలెత్తే ఏ సంఘటనకైనా తమకు సంబంధం లేదని, థియేటర్ యాజమాన్యాలు, వర్మే వాటికి బాధ్యత వహించాలని వారు స్పష్టం చేశారు. రాధా అభ్యంతరాలను పట్టించుకోకుండా వర్మ సినిమా తీశాడని వారు ఆరోపించారు. సినిమాపై రాధాకు వివరణ ఇచ్చిన తరువాతే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో త్వరలో విడుదల కానున్న వర్మ సినిమా మరోవివాదం రేపుతుందా? అన్న అనుమానం అందర్లోనూ రేగుతోంది.

More Telugu News