: ఈ మూడు నెలలూ కష్టమే... తరువాత బాగుంటుంది: జైట్లీ

పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ వెనుక జాతి యావత్తూ అండగా నిలిచిందని, నోట్ల రద్దును భారతావని స్వాగతించిందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలు బాగా సహకరిస్తున్నారని అన్నారు. ప్రస్తుత త్రైమాసికంలో నోట్ల రద్దు ప్రభావం వల్ల కలుగుతున్న నష్టాన్ని అంచనా వేయడం కొంత క్లిష్టతరమేనని, కొంతకాలం ఓర్చుకుంటే ఆపై భవిష్యత్తు అద్భుతమేనని ఆయన స్పష్టం చేశారు. నోట్ల రద్దు ప్రభావం వ్యవస్థపై కొంత కాలం మాత్రమే ఉంటుందని తెలిపారు. వాహన అమ్మకాలు తగ్గాయని గుర్తు చేసిన ఆయన, స్వల్పకాలిక ఇబ్బందులను ఎదుర్కొంటే, దీర్ఘకాలిక ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రతి చిన్న లావాదేవీ కూడా డిజిటలైజ్ అయితే, పన్ను రేట్లు గణనీయంగా తగ్గివస్తాయని, జనవరి నుంచి కాగితపు కరెన్సీని తగ్గిస్తామని అరుణ్ జైట్లీ వివరణ ఇచ్చారు. ప్రజల కష్టాలను తీర్చేలా మరింత నగదును వ్యవస్థలోకి సరఫరా చేసేందుకు ఆర్బీఐ చురుకుగా పనిచేస్తోందని తెలిపారు.

More Telugu News